సింగరేణిలో కొత్త గనులకు పూర్తి సహకారం

0
54

కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ అమ్రిత్ లాల్ మీనా
సింగరేణి సంస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని, సంస్థ అభివృద్ధి కోసం చేపట్టనున్న కొత్త గనులకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్ లాల్ మీనా హామీ ఇచ్చారు.

ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనలో ముందుండటంపై ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఆయన సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్, ఇతర డైరెక్టర్లతో కంపెనీ ప్రగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో సింగరేణి ప్రస్తుత పనితీరు భవిష్యత్తు ప్రణాళికలపై ఛైర్మన్ ఎన్.బలరామ్ వివరించారు. సింగరేణి ప్రాంతంలోని మూడు బొగ్గు బ్లాకుల కేటాయింపు పద్ధతిలో సింగరేణి సంస్థకే కేటాయించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అలాగే రానున్న కాలంలో చేపట్టనున్న కొత్త గనులకు త్వరితగతిన అనుమతులు లభించేలా చూడాలన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శి స్పందిస్తూ నిబంధనలకు లోబడి సింగరేణికి మేలు కలిగే విధంగా తగిన సహకారాన్ని అందిస్తామని సింగరేణి భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని ఆయన హామీ ఇచ్చారు.

అలాగే సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సోలార్, థర్మల్ ప్రాజెక్టుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సోలార్ రంగంలో చేపట్టే ప్రాజెక్టులపై కూలంకశంగా తెలుసుకున్నారు. సింగరేణి చేపట్టిన వ్యాపార విస్తరణ చర్యలైన థర్మల్, సోలార్, జియో థర్మల్, ఓబీ నుంచి ఇసుక ఉత్పత్తి, కమర్షియల్ ఇసుక తయారీ తదితర ప్రాజెక్టులపై అభినందనలు తెలిపారు.

ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డీ. సత్యనారాయణ రావు(ఈ అండ్ ఎం), ఎన్‌వీకే శ్రీనివాస్ (ఆపరేషన్స్ మరియు పర్సనల్), జీ. వెంకటేశ్వర్ రెడ్డి ( ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జే. ఆల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

అనంతరం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారిని బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్ లాల్ మీనా కలిసి పలు అంశాలపై చర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here