కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లే

0
23

– సొంత పార్టీ కంటే కాంగ్రెస్ పైనే కేసీఆర్ నమ్మకం ఎక్కువ
– లిక్కర్ నిందితులు తప్పించుకునే వీల్లేకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు సంస్థలు
– ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారా?
– ధరణి బాధితులతో పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టొచ్చు
– అమరవీరుల కుటుంబాలను తొమ్మిదేళ్లుగా పట్టించుకోని కేసీఆర్.. నేడు పిలిచి సన్మానించడం పెద్ద జిమ్మిక్కు
– తెలంగాణలో సింగిల్ గానే బీజేపీ పోటీ
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ప్రజానావ/కరీంనగర్: కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకల కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం ఉందన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోందే కేసీఆర్ అని, 30 స్థానాల్లో ఆ పార్టీకి డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచినా మళ్లీ వెళ్లేది బీఆర్ఎస్‌లోకేనన్నారు. కేసీఆర్ ను ఓడించాలి.. ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నాయకులంతా ఈ విషయమై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ‘మహా జనసంపర్క్ అభియాన్’లో భాగంగా బండి సంజయ్ గురువారం కరీంనగర్ లోని చైతన్యపురి, జ్యోతినగర్ కాలనీల్లో ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం నిర్వహించారు.

ప్రతి ఇంటికి వెళ్లి పేరుపేరునా పలకరిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. స్టిక్కర్లను స్వయంగా అంటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లిక్కర్ నిందితులు తప్పించుకునే వీల్లేకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించే పనిలో సీబీఐ, ఈడీ నిమగ్నమై ఉందన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏనాడూ అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్.. నేడు పిలిచి సన్మానం చేయడం.. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనుక పెద్ద జిమ్మిక్కు అని విమర్శించారు.

పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు తాను నివాసం ఉండే పోలింగ్ బూత్ లకు వెళ్లి ప్రజలతో మమేకం అవుతుండడం సంతోషంగా ఉందన్నారు. ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం ద్వారా ఈ ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తెలంగాణలో 90 లక్షలకుపైగా కుటుంబాలుంటే అందులో మూడో వంతుకుపైగా కుటుంబాలను బీజేపీ కార్యకర్తల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల వరకు కలిసేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఇది ఒక రికార్డు అని అన్నారు. తమ కార్యక్రమాలకు ప్రజల్లో మంచి స్పందన వస్తోందని, దీంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లారీ, ఆటో, ట్రాలీ, బస్ డ్రైవర్లందరినీ ఒకరోజు కలుస్తామని చెప్పారు. వీరితో పాటు టీ స్టాల్స్, పాన్ దుకాణాలు, హోటళ్లు, వ్యాపార నిర్వాహకులను కలిసేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

కిషన్‌రెడ్డి అన్ని వివరాలు ప్రకటించారు
తెలంగాణకు కేంద్రం ఏం చేసిందనే అంశంపై ఇటీవల కిషన్ రెడ్డి అన్ని వివరాలు ప్రకటించారని, బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలప్పుడు ఏయే హామీలిచ్చారు? ఎన్ని నెరవేర్చారు? ఎంత అభివృద్ధి చేశారో ‌వివరించాలని మేం కోరుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం అందుకు భిన్నంగా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకు 15వేల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ప్రారంభిస్తున్నడడంపై స్పందించిన బండి కేసీఆర్ తీరును కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. పేదలు ఇండ్లు లేక కిరాయిలు కట్టలేక అల్లాడుతున్నారని, అందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కేంద్రం 2. 4 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని, అవన్నీ ప్రజలకు పంచితే మరో 5 లక్షల ఇండ్లను మంజూరు చేయించే బాధ్యత నాదని కూడా చెప్పినా కేసీఆర్ ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేపర్లు, టీవీల్లో యాడ్స్ ఇస్తూ ప్రజలు చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో కట్టిన పన్నుల ఆదాయాన్ని యాడ్స్ పేరుతో నీళ్లలా ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధులో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కేసీఆరే చెప్పారంటే ఏమేర అవినీతి జరుగుతుందే ప్రజలు గమనించాలన్నారు. ధరణి తప్పుల తడకతో రైతులు అల్లాడుతున్నారని, ధరణి బాధితులందరినీ కలిపితే పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించవచ్చన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టి స్క్రీన్లు పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు..
కేసీఆర్ సాధించిందేమిటి? రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని, ఇది తెలిసే ప్రజలను మభ్యపెట్టేందుకే కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. బీజేపీ- బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై ‘దుబ్బాకలో బీజేపీ ఎవరి మీద గెలిచింది. హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీపై బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలే.. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లలో కూడా ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతైనయ్. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నం బీజేపీ మాత్రమే’నని ప్రజలు నమ్మి ఓట్లేస్తున్నారన్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసే కొట్లాడుతున్నయని, ఢిల్లీలో ర్యాలీలు తీస్తున్నాయని బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసే పోటీ చేయబోతున్నాయని జానారెడ్డి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అంతకుముందు పొన్నం వ్యాఖ్యలపైనా బండి సంజయ్‌ మండిపడ్డారు.. తను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సాయంతో ఎంపీగా గెలిస్తే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా ఎలా గెలిచారో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న కాళ్లకు గజ్జె కట్టి పాట పాడారు. కేసీఆర్ మాత్రం గద్దర్ గజ్జె కడితే తెలంగాణ వచ్చిందా? అని వెటకారం చేసిండు. ఇప్పుడు గద్దర్ కేసీఆర్ ను నిలదీయాలన్నారు. ఇక లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయకపోవడంపై మాట్లాడిన బండి సీబీఐ, ఈడీ రాజ్యాంగబద్ద సంస్థలని, మోదీ హయాంలో అవినీతిపరులు తప్పించుకునే ఆస్కారమే లేదన్నారు. అయితే నిందితులు తప్పించుకోవడానికి వీల్లేకుండా దర్యాప్తు సంస్థలు పకడ్బందీగా ఆధారాలు సేకరించిన తరువాతే అరెస్ట్ చేసి జైలుకు పంపుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ సింహం లెక్క సింగిల్ గానే పోటీ చేసి అధికారం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here