Phone tapping: ఫోన్‌ ట్యాపింగ్‌తో వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు

0
66
  • కేసీఆర్, కేటీఆర్‌కు నోటీసులిచ్చి విచారణ జరిపితే రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయత పెరిగేది
  • కేసులో సీబీఐ విచారణ కోరాల్సిన అవసరం ఉంది
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌
  • ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

‘దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలు చేపడుతున్న విచారణలో సమగ్రత, చిత్తశుద్ధి లోపించినట్లు కన్పిస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెలంగాణ ప్రతిష్ట మసకబారింది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ప్రత్యేక హక్కులను మంట కలిపారు.

రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాశారు. భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు ఫోన్ లో మాట్లాడుకునే అంశాలను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినడం ద్వారా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు.

విపక్షాల అణచివేత కోసం ఫోన్ ట్యాపింగ్ ద్వారా సైబర్ దాడికి తెగబడటం సహించరాని విషయం. ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాధినేత, మాజీ ముఖ్యమంత్రి

కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని విచారణలో వెలుగు చూసినా ఇంతవరకు వారికి కనీసం నోటీసులు ఇవ్వకపోవడాన్ని చూస్తుంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థల పనితీరు పలు అనుమానాలకు తావిస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మీడియాకు లీకులివ్వడమే తప్ప అధికారికంగా ఏం జరుగుతుందో ఇప్పటి వరకు వెల్లడించకపోవడం చూస్తుంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విచారణపై నెలకొన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.

మాకు అందుతున్న సమాచారం ప్రకారం… రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు కూడా మారినట్లు తెలిసింది.

రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఆ కుటుంబాన్ని కాపాడే యత్నం..


రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థ(ఎస్ఐబీ) అధికారులు విదేశాల నుండి ఫోన్ ట్యాపింగ్ కోసం నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేకంగా పరికరాలు తెప్పించినట్లు వార్తలు వెలువడ్డాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక వాస్తవాలు వెలుగు చూడకుండా ఉండేందుకు ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ధ్వంసం చేయడంతోపాటు దేశ భద్రతకు, ఉగ్రవాదులకు సంబంధించిన కీలకమైన డేటాను కూడా ధ్వంసం చేశారని స్వయంగా మీరే మీడియా సాక్షిగా వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నట్లు తెలిసింది. వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు ప్రతిపక్షాలకు విరాళాలు ఇవ్వకుండా బెదిరించి బీఆర్ఎస్ కు మాత్రమే బలవంతంగా విరాళాలిచ్చేందుకు గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

అందుకోసం కొందరు వ్యాపారవేత్తలను, బిల్డర్లపై అక్రమ కేసులు పెట్టినట్లు కూడా తెలిసింది. దీనికి బాధ్యులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నోటీసులిచ్చి విచారణ జరిపితే రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయత పెరిగేది.

కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారి కుటుంబాన్ని కాపాడే యత్నాలు చేస్తోందనే చర్చ ప్రజల్లో జరుగుతున్నందునే ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతిన్నది.

ఈ నేపథ్యంలోనే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం అనివార్యంగా కన్పిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్రత, రాజ్యాంగ, ప్రజాస్వామ్య ఉల్లంఘన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీరే స్వయంగా సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అదే సమయంలో రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నా.

అట్లాగే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్షాలపై సైబర్ దాడికి కారకుడైన మాజీ సీఎం కేసీఆర్ గారికి, ఆయన కుమారుడు కేటీఆర్ గారికి నోటీసులిచ్చి విచారణ జరపాలని కోరుతున్నా.

ఇంతటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ లు ఎమ్మెల్యే పదవులకు అనర్హులు. తెలంగాణ శాసనసభా నాయకుడిగా ఉన్న మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి స్పీకర్ కు లేఖ రాయాలని కోరుతున్నా’ అని లేఖలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here