– రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం
– రూ.29,669 కోట్ల మూలధన వ్యయం
– ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
– వ్యవసాయానికి రూ.19.746 కోట్లు
– ఐటీకి రూ.774 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
– విద్యా రంగానికి రూ.21,389 కోట్లు.. వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
– మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
– ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
– గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు,
– మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు
– బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు
– తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు
– యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
– వైద్య రంగానికి రూ.11500 కోట్లు,విద్యుత్
– గృహ జ్యోతికి రూ.2418కోట్లు
– విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు
– త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ
ప్రజానావ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని.. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి తెలిపారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప.. అమలుకు దిబ్బ అన్నట్లుగా ఉండేవన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అత్యంత ప్రధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన పెంచడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధిస్తామన్నారు.
ప్రజలపై భారం వేయడం మా విధానం కాదు..
గత పాలకులు ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించడంతో పాటు ప్రణాళిక లేకుండా, హేతుబద్దత లేకుండా వారు చేసిన అప్పులు ఇప్పుడు పెద్ద సవాళ్లుగా మారాయి. అయితే ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో, సహేతుకమైన కార్యచరణతో ఈ సవాళ్లను అధిగమిస్తామన్నారు. దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు భట్టి. కాళేశ్వరం ప్రాజెక్టు వంటి నిరర్ధకమైన ఆస్తులు పెంచుకుంటూ వాటిని తెలంగాణ ప్రజలపై భారం వేయడం మా విధానం కాదన్నారు.
కేవలం తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందడం, వారు సంతోషంగా ఉండటం మాత్రమే మా లక్ష్యం పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయని బడ్జెట్ లో ప్రతిపాదనలు చేశామన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని వెల్లడించారు. రైతుల రుణమాఫీపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా ఆయన రైతు రుణమాఫీపై గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని.. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని.. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇచ్చేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతుబంధు నిబంధనలు పునఃసమీక్షించి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద రూ.15 వేలు అందిస్తామన్నారు. అలాగే, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఆధారంగా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని కౌలు రైతులకూ వర్తింప చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని చెప్పారు. నాసిరకం విత్తనాలు అరికట్టేలా, నాణ్యమైన విత్తన ఉత్పత్తి జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. త్వరలోనే ఓ నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా అందించబోతున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని, ఈ పథకం అమలుకు బడ్జెట్లో రూ.2,418 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ట్రాన్స్ కో, డిస్కమ్లకు రూ.16,825 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.
గ్యారంటీల అమలుకు తొలి ప్రాధాన్యం
’ప్రజావాణి’లో రెండు నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054 కాగా, ఇళ్ల కోసం వచ్చినవి 14,951అని చెప్పారు. దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించామని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తుందని, మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు అందిస్తామన్నారు. గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం అన్నారు.
వోస్ పర్యటన ద్వారా రాష్టాన్రికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వం నుంచి 2 లెదర్ పార్కులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. డ్రై పోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ ప్రణాళిక అమలు చేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేధ ఉపయోగిస్తాం. ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధికి నూతన పాలసీ తీసుకుని వస్తాం. రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్ సంస్థతో సంప్రదింపులు చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత పటిష్ఠమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
బడ్జెట్ కేటాయింపులు..
– ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
– వ్యవసాయ రంగం రూ.19.746 కోట్లు
– ఐటీ శాఖ రూ.774 కోట్లు
– పురపాలక శాఖ రూ.11,692 కోట్లు
– విద్యా రంగం రూ.21,389 కోట్లు
– మూసీ ప్రక్షాళన రూ.1,000 కోట్లు
– వైద్యరంగం రూ.11,500 కోట్లు
– ఎస్సీ సంక్షేమ శాఖ రూ.21,874 కోట్లు
– గృహ నిర్మాణ రంగం రూ.7,740 కోట్లు
– మైనారిటీ సంక్షేమ శాఖ రూ.2,262 కోట్లు
– ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు
– ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు
– మైనార్టీ సంక్షేమ శాఖ రూ.2262 కోట్లు
– బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు
– తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు
– యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
– విద్యుత్ గృహ జ్యోతి రూ.2418కోట్లు
– విద్యుత్ సంస్థలు రూ.16825 కోట్లు
– నీటి పారుదల శాఖ రూ.28024 కోట్లు
ఇక గద్దర్ పేరిట అవార్డులు
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డును గద్దర్ అవార్ పేరుతో చిత్ర, టీవీ కళాకారులకు అందచేయనున్నామన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ కు ఇదే తాము ఇచ్చే నివాళి అన్నారు. గద్దర్ను గౌరవించడం అంటే తెలంగాణ సంస్కృతి, ప్రగతిల భావజాలంతో సమాజాన్ని చైతన్య పరిచే ప్రజా కవులు, ప్రజా గాయకులను గౌరవించడమే అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని భట్టి పేర్కొన్నారు.
శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నిరాటకంగా అందించే అవకాశం ఉంటుందన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగం ఎక్కువైందని, యువత యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నెలరోజులుగా మన పోలీసులు, ఆబ్కారీ అధికారులు దాడుల్లో పెద్ద మొత్తంలో పట్టుకున్న గంజాయి ఇతర మాదక ద్రవ్యాలే మా కార్యచరణకు నిదర్శనమన్నారు.
మాదక ద్రవ్యాల నిరోధక బృందాలకు అవసరమైన నిధులను సిబ్బందిని కేటాయించాం. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అనే మాట ఉత్పన్న కాకూడదన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా తెలంగాణ యువతను కాపాడుతున్నామన్నారు. ఈ నెల 4 వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంల హుక్కా బార్లను కూడా నిషేధించినట్లు గుర్తుచేశారు. ఎంతో కాలంగాణ పెండింగ్లో ఉన్న నూతన హైకోర్టు భవన సముదాయానికి వంద ఎకరాల స్థలాన్ని కేటాచించినట్లు చెప్పారు. న్యాయవ్యవస్థ పటిష్ఠతకు మేం తీసుకుంటున్న చర్యతో దేశ మొత్తం తెలంగాణ వైపు చూస్తుండడంతో సందేహం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశ పెట్టడం అయిష్టంగా ఉందన్నారు. కేంద్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకువాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసే నిధులు సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఉపయోగించుకోవాలనే స్పష్టత ఉందని భట్టి తెలిపారు.
అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్థిస్థాయి బడ్జెట్ లో వివిధ రంగావారిగా కేటాయింపులు జరిగినప్పుడే, మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతామన్నారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టినప్పుడే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశ పెడతుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన విధంగా ఆరు గ్యారంటీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తూ రాష్ట్రంలోని బడుగు, బలహీనులను అభివృద్ధి చేస్తామన్నారు.
నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు
ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో ప్రకటించారు. గత సర్కార్ పేదలకు డబుల్ బెడ్ రూంలని మోసం చేసిందని.. కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. ఇళ్లు లేనివారికి ఇండ్లు, స్థలం ఉంటే.. నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం చేస్తామని.. ఆ నిధులను కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవ్వబోతున్నామని చెప్పారు.
ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ఇస్తామని.. ఇందుకోసం బడ్జెట్ లో రూ. 7,740 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు కేటాయించామన్నారాయన. పంచాయతీరాజ్ శాఖకు రూ. 40, 080 కోట్లు కేటాయించామని వివరించారు. ఉపాధి కల్పన జోన్ గా మూసీ పరివాహక ప్రాంతం ఉందని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కోసం రూ. 500 కోట్లు.. యూనివర్సిటీల్లో సదుపాయాల కోసం రూ. 500 కోట్లు కేటాయిస్తామన్నారు.