లోయర్ మానేరు డ్యాంపై 300 మె.వా., మల్లన్న సాగర్ పై 500 మె.వా. ప్లాంట్ల ఏర్పాటు
రాష్ట్రంలో పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకూ పరిశీలన
సింగరేణి సీఎండీ బలరామ్
ఇప్పటికే సింగరేణివ్యాప్తంగా 234 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సింగరేణి సంస్థ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగా వాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉందని సింగరేణి చైర్మన్, ఎండీ బలరాం పేర్కొన్నారు.
హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఆయన సింగరేణి విద్యుత్ విభాగం పై డైరెక్టర్ ఈఅండ్ఎం డీ.సత్యనారాయణ రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులతో శనివారం ప్రత్యేక సమీక్షను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన కంపెనీ వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా కొత్తగా సింగరేణి సంస్థ చేపట్టనున్న సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులపై చర్చించారు.
సోలార్ విద్యుత్ పెంపుదలకు కృషి చేయాలని ఇటీవల రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ జలాశయాలైన లోయర్ మానేరు డ్యాంపై 300 మెగావాట్ల నీటిపై
తేలియాడే సోలార్ ప్లాంట్, మల్లన్న సాగర్ జలాశయం పైన 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సిద్ధంగా మానేర్ డ్యాం డీపీఆర్..
లోయర్ మానేర్ డ్యాం పై 300 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉండడంతో దీనిపై ప్రభుత్వ అనుమతితో నిర్మాణం చేపట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉందన్నారు.
కాగా మల్లన్న సాగర్ జలాశయంపై ఏర్పాటు చేయతలపెట్టిన రెండు 250 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్ను వెంటనే రూపొందించాలనీ ఆయన అధికారులను ఆదేశించారు.
రాజస్థాన్లో సింగరేణి ఏర్పాటు చేయతలపెట్టిన 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కు సంబంధించిన కార్యాచరణపై కూడా ఆయన సమీక్షించారు.
దీనిపై రూపొందించిన డీపీఆర్ పై మరింత లోతుగా అధ్యయనం జరపాలని, తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి జరిగే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, తద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలు సింగరేణి సోలార్ విద్యుత్తును ఎక్కువగా కొనే అవకాశం ఉంటుందన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర పనితీరుపైనా సమీక్షించారు. ప్రస్తుత 1200 మెగావాట్ల ప్లాంటుకు అదనంగా అదే ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల
సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి నిర్మాణం ప్రారంభించాలని అధికారులను కోరారు.
ఇటీవల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత లాల్ మీనా ఇదే ప్రాంగణంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్ తో పాటు మరో 800 మె.వా.ప్లాంట్ ను కూడా నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సూచించారన్నారు.
దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై వెంటనే ఒక నివేదిక సమర్పించాలని చైర్మన్ ఆదేశించారు. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటు చేయటానికి అవకాశం గల ప్రాంతాలను సందర్శించాలని, దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా రూపొందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బసివి రెడ్డి, జనరల్ మేనేజర్ సివిల్ సూర్యనారాయణ , మేనేజర్ సోలార్ జానకీరామ్, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకేవీ రాజు, చీఫ్ ఓ అండ్ ఎం జేఎన్ సింగ్, డీజీఎంలు వేణుగోపాల్, సీహెచ్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.