- రేవంత్.. పాలమూరు చౌరస్తాకు రా.. తేల్చుకుందాం
- బిడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడుతావా?
- నీకు తల్లి, చెల్లి, బిడ్డా లేదా?
- ఆగస్టులోగా రైతు రుణమాఫీ రాకపోతే నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా?
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్
‘నన్ను తొక్కుతా అంటావా? రా.. దమ్ముంటే ఎక్కడికోస్తావో రా? బిడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడుతావా? నీకు తల్లి, చెల్లి లేదా.. నీకు బిడ్డా లేదా? ఒక మహిళా నేత గురించి ఎలా మాట్లాడాలి అన్న సంస్కృతి కూడా లేదా? మిస్టర్ రేవంత్ రెడ్డి నీ భాష మార్చుకో’ అంటూ బీజేపీ సీనియర్ నేత, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అరుణమ్మ గురించి మాట్లాడే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకోవాలన్నారు.
ఒక మహిళను ఓడించేందుకు గుంపులు కట్టి నోటికొచ్చినట్లు మాట్లాడితే పాలమూరు ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నీచ, అహంకార సంస్కృతిని చూసి ప్రజలు అసహించుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ఇచ్చిన అరు గ్యారంటీలపై మాట్లాడకుండా ఇక్కడి కొచ్చి నోటికొచ్చినట్లు తిట్టి పొతున్నారని, రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉండి పాలమూరు కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కే లేదన్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక సీఎం రేవంత్ ఐదు సార్లు పాలమూరుకు వచ్చారని, విమర్శలు చేయడం కాదు.. పాలమూరు చౌరస్తాకు రా..తేల్చుకుందామని పునరుద్ఘటించారు.
ఈ ప్రాంత బిడ్డగా తాను ఇక్కడి ప్రజల మన్ననలు పొందుతుంటే కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని అందుకే ఓ మహిళ అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్య మంత్రి పదవి పరువు కాపాడు..
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగవి ప్రధాని మోడీపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావా అని సీఎం రేవంత్పై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్య మంత్రి పదవి పరువు కాపాడాలని.. గద్వాల కోట గురించి, నా నీతి, జాతి గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిదని ప్రశ్నించారు.
డీకే సత్యరెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే హక్కు నీకు లేదన్నారు. ఆగస్టులోగా రైతు రుణమాఫీ కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
హామీలు అమలు చేయకపోతే పదవి వదిలేస్తావా.. ఈ సవాల్ కు సిద్ధమా అని ప్రశ్నించారు. దేవుళ్ల మీద కాంగ్రెస్ దొంగ డ్రామాలు ఆపాలన్నారు.
మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కుటుంబాల మీద ప్రమాణం చేయాలన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా సింపతీ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.