– అందుబాటులోకి 100 కొత్త బస్సులు
– జూన్ నాటికి దశలవారీగా 1325 బస్సులు
మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ సహకారంతో టీఎస్ ఆర్టీసీ కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి 1325 బస్సులను దశలవారీగా వాడకంలోకి తెచ్చేలా ప్లాన్ చేసింది. అందులో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్ ప్రెస్, 75 డీలక్స్, 138 లహరి, రాజధాని బస్సులున్నాయి. వాటిలో ఇప్పటికే కొన్ని బస్సులను వాడకంలోకి తెచ్చిన సంస్థ.. తాజాగా మరో 100 బస్సులను ప్రారంభించబోతుంది. హై
దరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని డా. బీఆర్. అంబేద్కర్ విగ్రహాం వద్ద శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్తో పాటు టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారు.
కొత్తగా అందుబాటులోకి వస్తోన్న ఈ 100 బస్సుల్లో.. 90 ఎక్స్ ప్రెస్ బస్సులున్నాయి. ఇవి మహాలక్ష్మి-ఉచిత బస్సు ప్రయాణ స్కీంకు ఉపయోగపడనున్నాయి. అలాగే, శ్రీశైలం ఘాట్ రోడ్డుకు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా సంస్థ ప్రవేశపెడుతోంది. శ్రీశైలానికి వెళ్లే భక్తులు సంస్థ అధికారిక వెబ్ సైట్ wwww.tsrtconline.in ద్వారా సీట్లను ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది.